Sunday 19 September 2010

దేవుడు చూస్తాడు ,కానీ....ఆలస్యంగా

నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాకు నాన్ డిటైల్ లో ఒక షార్ట్ స్టోరీ ఉండేది.'GOD SEES THE TRUTH BUT WAITS 'అని.
అందులో  ఒకతను వ్యాపార నిమిత్తం వేరే ఊరు వెళ్ళటానికి బయలుదేరతాడు.భార్య తనకు చెడ్డ కల వచ్చిందని ,మరుసటి రోజు వెళ్ళమని చెపుతుంది.కానీ అతను ,తనకు అలాంటి నమ్మకాలేమీ లేవని ఆ రోజే బయలుదేరి వెళతాడు.ఆ రోజు రాత్రి ఒక ఊళ్ళో బస చేస్తాడు.అతను బస చేసిన హోటల్ కే ఒక హంతకుడు వస్తాడు.పోలీసులు వెంటపడుతుండటం తో హత్య కు వాడిన కత్తి ని వ్యాపారి బ్యాగ్ లో దాస్తాడు.హంతకుడు తప్పించుకుంటాడు.వ్యాపారి ని పోలీసులు పట్టుకుంటారు.అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.ఆ వ్యాపారి శిక్ష అనుభవిస్తూ జైలు లో ఉంటాడు.ఆ వ్యాపారికి డెబ్బయి ఏళ్ళు ఉన్నప్పుడు ,ఆ జైలు కు ఒక కొత్త ఖైదీ వస్తాడు.అతను జైలు కు ఏ నేరం మీద  వచ్చాడు అని అడుగుతారు .అందుకు ఆ ఖైదీ ప్రస్తుతం తను ఏ నేరం చేయక పోయినా జైలు కు వచ్చానని ,40 ఏళ్ళ క్రితం తను ఒక హత్య చేసినా పట్టుబడలేదని చెపుతాడు.పాత ఖైదీలను వారు జైలు కు ఎందుకు వచ్చారో చెప్పమని అడుగుతాడు.అలా తెలుసుకుంటున్న క్రమం లో తను చేసిన హత్యకు వ్యాపారి శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుసుకుంటాడు.తన నేరం అంగీకరిస్తానని ,ఆ వ్యాపారి జైలు నుంచి వెళ్లిపోవచ్చని చెపుతాడు.అప్పుడు ఆ వ్యాపారి....ఇప్పుడు నేను బయటకు వెళ్లి మాత్రం ఏమి చేస్తాను?అనుభవించాల్సిన వయసంతా జైలు లోనే గడిపాను.నా భార్య ,పిల్లలు ఎక్కడ ఉన్నారో,అసలు ఉన్నారో లేదో తెలియదు.ఈ ముసలి వయసు లో ఏ పనీ చేయలేను అంటాడు.

తప్పు  చేసిన వాళ్లకు ఎప్పటికైనా శిక్ష పడుతుంది,దేవుడు చూస్తూనే ఉంటాడు అంటారు.జీవితాంతం అన్యాయాలు,అక్రమాలు చేస్తా , కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఆనందంగా బ్రతికే వాళ్లకు రేపో మాపో పోతారనగా శిక్ష పడినా ఉపయోగం ఏమిటి?దేవుడు చూస్తానే ఉంటాడు గా ,మరి వెంటనే శిక్ష పడేలాగా చేయకుండా ,ఆలస్యం ఎందుకు చేస్తాడు?ఈ జన్మ లో కాకపోయినా వచ్చే జన్మలో అయినా అనుభవించాల్సిందే అంటారు.ఈ జన్మ లో ఆనందం గానే ఉన్నాము కదా,తప్పులు చేస్తున్నా.....ఉందో,లేదో తెలియని ఆ వచ్చే జన్మ గురించి ఎవరు ఆలోచిస్తారు?ఎంత మంచి గా ఉన్నా కష్టాలు పడుతుంటే ,పూర్వ జన్మలో ఎంత పాపం చేసావో అందుకే నీకు ఇన్ని కష్టాలు అంటారు.మంచి గా ఉండి కష్టాలు పడె బదులు ఆనందం గా ఉండటానికి ఏమయినా చేయోచ్చు అని అనుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లేగా?దాని బదులు ఎప్పుడు చేసిన తప్పుకు అప్పుడే శిక్ష విథించేస్తే ఈ గోల అంతా ఉండదు కదా?
అప్పుడు జనాలు అందరూ మంచివాళ్ల గా అయిపోతారేమో!  

Thursday 16 September 2010

వద్దంటే బహుమతులు

బహుమతులు వద్దనుకునే పిచ్చి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటున్నారా?పోటీ లో పాల్గొని గెలుచుకునే బహుమతులు గురించి కాదు నేను చెప్పేది.అలాగే ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళు ,ఫంక్షన్ చేస్తున్న వాళ్లకు ఇచ్చే బహుమతుల గురించి కూడా కాదు.ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు ఫంక్షన్ కు వచ్చినవాళ్ళకు ఇచ్చే బహుమతుల గురించి.బారసాల మొదలుకుని మరణం వరకు వివిధ రకాల ఫంక్షన్స్ లో ఇచ్చే బహుమతుల గురించి. ఒక అయిదు ,ఆరు దశాబ్దాల క్రితం కుటుంబం లో ఎవరయినా చనిపోతే వారి జ్ఞాపకార్థం ఇత్తడి గ్లాసులు బాగా దగ్గరి బందువులకు మాత్రమే ఇచ్చుకునే వారట.కాలక్రమేణా బంధువులందరికీ ఇవ్వటం ,ఆ తరువాత బంధువులు కానివారికి కూడా ఇవ్వటం ,ఇత్తడి స్థానాన్నిస్టీల్ ఆక్రమించటం జరిగింది. అలాగే గ్లాసుల స్థానం లో ప్లేటులు,తపాలాలు,గిన్నెలు ,బాక్స్లు,etc .,etc .,ఇవ్వటం మొదలు పెట్టారు.ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ 90 ల లో వోణీ ల ఫంక్షన్ లో,ఎంగేజి మేంట్ (మ్యారేజ్ )ఫంక్షన్ ల లో కూడా ఇవ్వటం మొదలు పెట్టారు.చనిపోతే కర్మ రోజే కాకుండా ఐదో రోజు గారెలు ,పూర్ణాలు పంచేటప్పుడు కూడా ఒక గిన్నో,ప్లేటో ఇవ్వటం మొదలు పెట్టారు.అలాగే ఎంగేజి మేంట్ కు ఒకటి ,పెళ్లి లో మరొకటి.ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అని భేధభావం చూపెట్టకుండా బారసాల మొదలుకుని అన్ని ఫంక్షన్ లకు,గృహప్రవేశాలకు,పుట్టిన రోజులకు  ఏదో ఒక వస్తువు ఇవ్వటం మొదలు పెట్టారు.స్టీల్ వే కాకుండా స్తోమతను బట్టి,కాదేది బహుమతి కి అనర్హం అన్నట్లు వెండి కుంకుం భరిణలు ,బంగారపు పోగులు ,ప్లాస్టిక్ వస్తువులు ,గాజు ,పింగాణి పాత్రలు ఇస్తున్నారు.ప్రస్తుత ట్రెండ్ గాజు బౌల్స్ ఇవ్వటం.సరే వెండి,బంగారం అంటే రేర్ గా వచ్చేవి కాబట్టి పరవాలేదు.వచ్చిన ఇబ్బంది అంతా స్టీల్,గాజు వాటితోనే.ఈ ఇరవై ఏళ్ళలో మాకు వచ్చిన స్టీల్,గాజు వస్తువులు ఎక్కడ సర్దాలో తెలియక పిచ్చెక్కుతోంది.మేము విజయవాడ లో ఉన్నప్పుడు స్టీల్ సామాను చాలా వరకు ఉల్లిపాయల వాడికి వేసి వదిలిన్చుకున్నాను.గాజు సామాను వదిలించుకోవటానికి ఏలాంటి మార్గము లేదు.(చేతిలోంచి జార విడిస్తే వదిలించుకోవచ్చు అనుకోండి.కానీ కావాలని జార విడువ లేము కదా)ఈ వేలం వెర్రి, జనాలను ఎప్పుడు వదులుతుందో?ఆచారం గా మారిన ఈ బహుమతులు ఇచ్చే పద్దతి ని తొందరలో నే జనాలు వదిలి పెడతారని ఆశిద్దాము.

ఈ పోస్ట్ రాయటానికి కారణం .........
ఈ మధ్య మా పిన్ని వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ,మా పిన్ని స్టీల్ ,గాజు సామాను చూపించి నీకు నచ్చినవి తీసుకు వెళ్ళు.మా ఇంట్లో అలమారాలు అన్ని నిండిపోయాయి ,ఎక్కడ సర్దాలో తెలియటం లేదు అంటే నాదీ అదే పరిస్తితి ,నాకు వద్దు బాబోయ్ అని వచ్చేసాను.

Monday 13 September 2010

చావు-విషాదమా?ఆనందమా?


ఏమిటి ఈ పిచ్చి ప్రశ్న ?ఈవిడ కు మతి గాని పోయిందా...అని అనుకుంటున్నారా?అలాంటిదేమీ లేదు లెండి.చావు అనేది విషాదకరమయిన సంఘటనే...అందరి  దృష్టి లో .మరయితే ఎవరయినా చనిపోయినప్పుడు ,వారి కుటుంబ సభ్యులను పలకరించటానికి వెళ్ళినప్పుడు  స్వీట్స్ తీసుకొని వెళతాము,ఎందుకు?నాకు తెలిసినంతవరకూ మన కుటుంబ సభ్యులు ఎవరయినా చనిపోయినప్పుడు ఏడవకూడదు.ఏడిస్తే మన కన్నీళ్లు అడ్డుపడి ,చనిపోయిన వారి ఆత్మ,స్వర్గానికి వెళ్ళటానికి వైతరిణి దాటటం కష్టమవుతుందట.కానీ ,చనిపోయిన వారి తో మనకున్న అనుబంధం,వారి తాలూకు జ్ఞాపకాలు మనల్ని ఏడిచేలా చేస్తాయి.ఇప్పటి కాలం లో కొంతమంది ఏడుపు రాకపోయినా ఇతరులు ఏమనుకుంటారో అని ,తప్పక ఏడిచే వాళ్ళు ఉన్నారు.మా మామ గారు చనిపోయినప్పుడు ,మా అత్తగారు,ఆడపడుచు ....ఉన్నన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళనే పట్టించుకున్నాడు,ఇంట్లో వాళ్లకు చేసిందేమీ లేదు,అదీ..ఇదీ అని మాట్లాడుకుంటున్న వాళ్ళు కాస్తా,పలకరించటానికి వచ్చే వాళ్ళను గేటు దగ్గర చూడగానే శోకాలు మొదలు పెట్టారు.వాళ్ళు వెళ్ళిపోగానే మళ్లీ మామూలు గానే మాటలు మొదలు.అలా ఎవరయినా రావటం చూడగానే ఏడుపు ,వెళ్ళిపోగానే రకరకాలుగా మాట్లాడుకోవటం .....ఇదే తంతు కొనసాగింది.ఒక సంవత్సరంన్నర  క్రితం మా అక్కయ్య గారమ్మాయి రోడ్  యాక్సిడెంట్ లో చనిపోయింది.పలకరించటానికి వెళ్ళాము.బావగారు వచ్చిన వాళ్ళందరిని ,చాలా క్యాజువల్ గా నవ్వుతూ పలకరిస్తున్నారు.మాకు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.వచ్చిన వాళ్ళందరూ తలా ఒక రకం గా మాట్లాడారు.బ్రహ్మకుమారి సంఘం లో ఉన్నాడు కదా ...అందుకనే అలా దుఃఖ పడకుండా మామూలు గా ఉండగలుగుతున్నాడు అని కొందరు,చిన్న వయసు లో నే పిల్ల చనిపోయింది కదా ,షాక్ లో ఉండి అలా ప్రవర్తిస్తున్నాడు అని కొందరు ....

నేనయితే  గీత లో చెప్పినట్లు చావు విషాదకరమయినది కాదు అనే అనుకుంటున్నాను.
  
దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌవనం జరా
తధా దేహాంతర ప్రాప్తిః  ధీర స్తత్ర న ముహ్యతి

బాలుడు శైశవం ,బాల్యం,యౌవనం,మొదలగు మార్పులు చెందినప్పుడు ఎట్లా దుఃఖించట్లేదో,అట్లే మరణం అంటే ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహం ధరించుట అని జ్ఞానులు గ్రహించి మరణ విషయమై చింతించరు.