Tuesday 25 June 2019

ప్రజా వేదిక



రెండు రోజుల క్రితం రాజధాని ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు కరకట్ట పొడవునా భారీ కట్టడాలు.నది కనిపించలేదు.నా చిన్నప్పుడు, తాతమ్మ వాళ్ళ ఊరు వెళితే తోట కెళ్ళినప్పుడు,తోట చివరికంటా వెళితే కట్ట - ఆ కట్ట ఎక్కితే కృష్ణా నది కనిపించేది. ఒక్కోసారి నీరు తక్కువున్నప్పుడు ఆ కట్ట దిగి ఇసుక లో ఆడి వచ్చేవాళ్ళం.కరకట్ట పక్కన కట్టిన అక్రమ కట్టడాలు అన్నీ ఇప్పటికిప్పుడు కట్టినవి కావు.గత పదేళ్ల నుంచి కడుతూనే ఉన్నారు.మరి అవి కట్టటానికి ఎవరు అనుమతులిచ్చారు?ఒకవేళ అనుమతి లేకుండా కట్టితే అప్పటి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంది?సరే ఆతర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది?యాక్షన్ తీసుకోవటానికి, అక్కడ ఉన్న కట్టడాల్లో ఎక్కువ శాతం ఆశ్రమాలే !వాటిని కూల్చితే వారి భక్తులు ఊరుకుంటారా ? గత కొన్నేళ్లుగా ,హిందూ మతానికి ఏదో ముప్పు వాటిల్లుతుందని,మతాన్ని పరిరక్షించాలని స్లో పాయిజన్ టైపు లో ప్రజలలో ఒక భ్రమ కలిగించారు.ఆ భ్రమ లో నుంచి ఇప్పట్లో జనం బయటకు వచ్చే సూచనలు ఏమీ కనిపించటం లేదు.ప్రజావేదిక కూల్చివేతకు జగన్ తీసుకున్న నిర్ణయం లో తప్పు బట్టే అంశం ఏమీ లేదు. స్పీచ్ కూడా చాలా గొప్పగా ఉంది.కాకపోతే ఆచరణలో ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.ప్రజావేదిక ప్రభుత్వానికి చెందినది కావున వెంటనే కూల్చివెయ్యొచ్చు.మరి ఆశ్రమాలు,మిగతా ప్రైవేట్ కట్టడాల సంగతి ? అంత ఈజీ కాకపోవచ్చు.అన్ని కట్టడాలను కూల్చివెయ్యగలిగితే,నిజం గానే ఒక మంచి ముఖ్య మంత్రి ఆంధ్రప్రదేశ్ కి లభించాడని సంబరపడొచ్చు.

ఇంకో విషయం ...

బకింగ్ హాం కెనాల్ - ఈ పేరు వినే ఉంటారు,(కాకినాడ నుంచి తమిళనాడు వరకు ,ఈ కెనాల్ ఉంది )విజయవాడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళుతుంటే ,దారి పొడువుతా ,కాలాలతో సంబంధం లేకుండా ,నిండుగా నీళ్లతో ప్రవహిస్తూ కనిపించేది. అలాంటి కెనాల్ ఇప్పుడు చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది.ఇంతకు మునుపెన్నడూ కెనాల్ని ఆ విధంగా చూడలేదు.ఇది కూడా ఆక్రమణలకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఏవయినా నిర్మాణాలు జరిగి అవి పూర్తయ్యేంతవరుకు నిద్రపోవటమో,లేదా నిద్ర నటించడమో చేయకుండా ప్రభుత్వం త్వరగా మేలుకుని సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది .