చాలా మందికి సంబారు కారం అంటే తెలియదు,సాంబారు పొడి గా పొరబడుతుండటం తో ఈ పోస్ట్ రాయాల్సి వచ్చింది.(ఈ పోస్ట్ ఎందుకు రాశావ్ అని ఎవరూ అడగరను కోండి,ఊరికే చెప్పాలనిపించిది)
కావాల్సినవి:
ఎండు మిరపకాయలు -1 kg
జీలకర్ర -2 గిద్దలు (1/4 kg)
మెంతులు -గిద్ద (125 gms)
ధనియాలు -3 గిద్దలు (375gms)
కళ్లుప్పు - 5 గిద్దలు (625gms)
చిన్నుల్లి పాయలు(వెల్లుల్లి)-1/4 kg
ఆముదం -100gms Optional
ముందుగా ఎండు మిరపకాయల్ని తొడిమలు తీసి మంచి ఎండలో (పిచ్చి ఎండ కూడా ఉంటుందా అనే పిచ్చి ప్రశ్నలు వేయకండి,నాకు తెలుసు మీరందరూ చాలా మంచి వారని,అలాంటి పిచ్చి ప్రశ్నలు వేయరని.ఏదో ముందు జాగ్రత్తగా చెప్పాను.)ఎండ పెట్టండి.జీలకర్ర,మెంతులు,ధనియాలు కూడా ఎండపెట్టండి.
ఆ తరువాత జీలకర్ర,మెంతులు,ధనియాల ని విడి విడిగా కమ్మని వాసన వచ్చేవరకు బాణలి లో వేయించుకోండి.(నూనె వెయ్యకుండా)ఉప్పు ను కూడా డార్క్ గ్రే కలరు వచ్చేవరకు వేయించండి.
వేయించుకున్నారా?ఇప్పుడు అన్నిటిని కలిపి మిరపకాయల తో పాటు రోటిలో వేసి దంచండి. అవి మెదిగాక, చివరికి చిన్నుల్లి పాయలు వేసి దంచి ఆముదం వేసి కలుపుకోవాలి.గ్రైండ్ చేసేటట్లయితే మరీ మెత్తగా కాకుండా కొంచం బరక గా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.
కారం తయారు చేసుకోవటం అయిపోయింది.ఇక దీన్ని ఎలా వాడాలి అంటారా?వేపుడు కూరల్లో తప్పించి అన్ని కూరల్లో వేయొచ్చు.
ఈ కారం లో నెయ్యి వేసుకుని ఇడ్లి,దోశ,ఆయ కుడుములు నంజుకుని తినొచ్చు.అన్నం లోకి ముద్దపప్పు ,సంబారు కారం,నెయ్యి వేసుకుని తినొచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు?మీరు కూడా సంబారు కారం తయారు చేసుకుని ,ఉపయోగించి మీకు నచ్చిందో లేదో తెలియ చేయండి.