Wednesday 25 January 2017

కర్ణాటక కోవెల యాత్ర - కుంభాశి,కలశ

యాత్ర లో చివరి రోజు బేలూరు ... అక్కడ్నుంచి డైరెక్ట్ బెంగళూరు రైల్వే స్టేషన్ ... మరుసటి రోజు ప్రొద్దున్నే ఇంటికి చేరాము.సమయాభావం వల్ల లిస్ట్ లో ఉన్న హాలేబీడు,శ్రావణ బెళగొళ చూడలేకపోయాము.వాటికి కాంపెన్సేషన్ అన్నట్టు లిస్ట్ లో లేని ఆనిగెడ్డ వినాయకుడుని,కలశ లోని కలసేశ్వరుడుని దర్శించుకున్నాము.

ఏడు ముక్తిస్థలాల్లో,ఆనిగెడ్డ  ఒకటి.ఆనిగెడ్డ కు ఇంకో పేరు కుంభాశి.అగస్త్య ముని యజ్ఞం చేస్తుండగా కుంభాసురుడు అనే రాక్షసుడు ఆటంకం కలిగిస్తుంటే వినాయకుడు,భీముని కి కుంభాసురుడు ని చంపటానికి ఒక ఖడ్గం ఇచ్చ్చారుట.ఆ ఖడ్గంతో భీముడు కుంభాసురుడు ని చంపి యజ్ఞానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా చేసాడు. అందువల్ల కుంభాశి అనే పేరు ...  ఇక్కడ స్వామికి ,భక్తులు వక్కపూలు సమర్పిస్తున్నారు. ప్రసాదంగా వక్క పూలు ఇస్తే ,తినొచ్చా - తినకూడదా ఏమి చెయ్యాలి అనుకుంటూ కొంతసేపు చర్చించుకుని ఆఖరికి తిన్నాము. టేస్ట్ బాగానే ఉంది- కొంచం పుల్లగా.మేము తినటం పూర్తయ్యాక చూసాము.స్థానికులు అనుకుంట,వక్కపూలుతలలోపెట్టుకున్నారు.మనం తెలియక తినేసాము,తినటానికి ఫస్ట్ అనుకుంటూ నవ్వుకున్నాము.


(ఫోటో గూగుల్ నుంచి )


వక్కపూలు (శృంగేరీ లో తీసిన ఫోటో )


స్కంధ పురాణం,తుంగభద్ర కాండం లో ,కలశ గురించి ప్రస్తావన ఉందట.దీనిని దక్షిణ కాశీ గా భావిస్తారు.






   

Tuesday 17 January 2017

కర్ణాటక కోవెల యాత్ర - శృంగేరి

అష్టాదశ శక్తి పీఠాలలో కాశ్మీర్ లోని సరస్వతీ పీఠం ఒకటి.మా టూర్ ఆపరేటర్ చెప్పటం,ఇప్పుడు కాశ్మీర్లో శక్తి పీఠం లేదు అని.అక్కడ అమ్మవారికి పూజలు సరిగా చెయ్యటం లేదని,శంకరాచార్యుల వారు,అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి శృంగేరిలో ప్రతిష్టించారని. నిజం ఎంతో తెలియదు.తుంగా నది ఒడ్డున ఈ గుడి ఉంది.అమ్మవారి గుడి తో పాటు విద్యాశంకర గుడి కూడా ఉంది.







శృంగేరి లో అమ్మవారిని దర్శించుకుని,ప్రస్తుత శృంగేరి పీఠాధిపతి అక్కడే ఉన్నారని తెలిసి , ఆయనను  కూడా చూసి ఆశీర్వాదం తీసుకుని వచ్చాము.భోజనం పీఠం లోనే కానిచ్చి హోరనాడు వెళ్ళాము.ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారి గుడి ఉంది.చుట్టూ కొండలు,ఎటు చూసినా పచ్చదనం ... చాలా బాగుంది. 



     



Thursday 5 January 2017

కర్ణాటక కోవెల యాత్ర - కొల్లూరు

మురుడేశ్వర్ నుంచి ఉడుపి జిల్లాలోని కొల్లూరు మూకాంబికా గుడికి వెళ్ళాము.పురాణాల ప్రకారం , పూర్వం కౌమాసుర  అనే రాక్షసుడు శివుడు ఇచ్చిన శక్తుల అహంకారం తో దేవతలను వేధిస్తూ ఉండేవాడు.కౌమాసుర,తనకు చావు లేకుండా వరం పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమయ్యి,ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు.వరం పొందితే రాగల  ఆపదను పసిగట్టిన సరస్వతీ దేవి అతని వాక్కును బంధించగా వరం అడగలేకపోతాడు.అప్పట్నుంచి అతనికి మూకాసురుడు అనే పేరు వచ్చింది. మూకాసురుడు ని చంపటానికి ముగ్గురు అమ్మలు (లక్ష్మి,సరస్వతి,పార్వతి)ఒక్కటయ్యి మూకాంబికా అవతారమెత్తి సంహరిస్తారు.చారిత్రిక ఆధారాల ప్రకారం ఈ గుడి 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడింది.



  అమ్మవారి రధం 


గుడి లోపల, ఎంట్రన్స్ కి దగ్గర 


ఇంకో కథనం ఏమిటంటే, శంకరాచార్యులు - సరస్వతి అమ్మవారిని భక్తి తో కొలవగా, అమ్మవారు ప్రసన్నమయ్యి ప్రత్యక్షమయ్యారుట.అప్పుడు శంకరాచార్యుల వారు కేరళ లో ఆవిడకంటూ ఒక్క గుడి కూడా లేదని ,అందుకని తనతో కేరళ రమ్మని కోరారుట.దానికి అమ్మవారు అంగీకరించి ఒక షరతు విధించారట.అదేమిటంటే,గమ్యం చేరేవరకు వెనుదిరిగి చూడకూడదు.అలా చేస్తే ఉన్న చోటే నిలిచి పోతానని.దానికి అంగీకరించి బయలుదేరారు.తనతో పాటే వస్తున్న అమ్మవారి కాళీ మువ్వల శబ్దం- ఒకచోట  ఆగిపోయేసరికి  శంకరాచార్యులు వెనుదిరిగి చూడటం తో అమ్మవారు అక్కడే ఆగిపోయారు. శంకరాచార్యుల వారు పదే పదే క్షమించమని వేడుకోవటంతో,కేరళ లోని చొట్టనిక్కర గుడి లో ఉదయం పూట ,మధ్యాహ్నం మూకాంబిక గుడిలో ఉంటానని చెప్పారట. 

మేము కొల్లూరు వెళ్ళేప్పటికి మధ్యాహ్నం అయ్యింది.ఆ కథనం నిజమయితే - అమ్మవారు వచ్చే సమయానికి మేము వెళ్లామన్న మాట 😄       

దర్శనం చేసుకుని,సాయంకాలానికి మళ్ళీ ఉడుపి చేరుకున్నాము.మళ్ళీ కృష్ణుడి గుడికి వెళ్లి , మేము కూడా దీపాలు వెలిగించి వచ్చాము. కొంచం షాపింగ్ కూడా   😄